విజయవాడకు స్పెషల్ విమానంలో... నేడు మీడియాతో మాట్లాడనున్న ప్రిన్స్ మహేష్ బాబు
- అభిమానులతో కలసి సినిమా చూడనున్న మహేష్
- అన్నపూర్ణా థియేటరులో విజయోత్సవాలు
- వెల్లడించిన గల్లా జయదేవ్
ప్రస్తుతం 'భరత్ అనే నేను' చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నేడు విజయవాడలో అభిమానులతో కలసి సినిమాను వీక్షించేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. విజయవాడ అన్నపూర్ణా థియేటరులో జరిగే విజయోత్సవ వేడుకలకు మహేష్ హాజరవుతారని తెలిపారు. ఆపై ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమవుతారని కూడా పేర్కొన్నారు. "విజయవాడ... మేము వస్తున్నాం. మహేష్ బాబు, కొరటాల శివ తదితరులతో కలసి..." అని జయదేవ్ ట్వీట్ చేశారు.